HomeEntertainmentఎస్.జానకి బయోగ్రఫీ: 17 భాషలు, 49వేల పాటలు పాడిన గానకోకిల ప్రస్థానం!

ఎస్.జానకి బయోగ్రఫీ: 17 భాషలు, 49వేల పాటలు పాడిన గానకోకిల ప్రస్థానం!


ఎస్.జానకి బయోగ్రఫీ: 17 భాషలు, 49వేల పాటలు పాడిన గానకోకిల ప్రస్థానం!

Jul 12, 2026 9:53AM

దక్షిణ భారత చలనచిత్ర గాత్ర ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రత్యేక శకం, ఒక అపురూపమైన స్వరం ఎస్. జానకి గారిది. ఆవిడ కేవలం ఒక నేపథ్య గాయని మాత్రమే కాదు, గాత్రంతో నవరసాలను పలికించగల ఒక గొప్ప అభినేత్రి. గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని వట్టపట్ల గ్రామంలో ఆయుర్వేద డాక్టర్ సిస్టలా శ్రీరామమూర్తి గారి ఇంట మొత్తం 9 మంది సంతానంలో ఆరుగురు ఆడపిల్లలలో 4వ అమ్మాయిగా జన్మించారు జానకి గారు. చిన్నతనం నుంచే చదువు కంటే రేడియోలో వచ్చే సినిమా పాటలను విని, వాటిని అనుకరిస్తూ పాడటం ఆవిడకు అలవాటుగా మారింది. ఆ గాత్రంలోని వైవిధ్యాన్ని గుర్తించి రాజమండ్రిలో ఉన్నప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్పించారు. అక్కడే ప్రముఖ దర్శకులు వి. రామచంద్రరావు గారి క్రాంతి కళామండలి ద్వారా తొలిసారిగా వేదికలపై పాటలు పాడే అవకాశం లభించింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు మారిన జానకి గారు, ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్, ‘ఫన్ డాక్టర్’ చంద్రశేఖరం గారి నాటక ప్రదర్శనల మధ్యలో పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆ చంద్రశేఖరం గారి కుమారుడైన రామప్రసాద్ గారిని వివాహం చేసుకుని మద్రాసులో అడుగుపెట్టారు.

మద్రాసులో జానకి గారి ప్రతిభను గుర్తించిన మామగారు ఏవీఎం స్టూడియోకు లేఖ రాయడంతో సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం గారు ఆవిడకు వాయిస్ టెస్ట్ చేశారు. అలా కేబీ తిలక్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘ఎమ్మెల్యే’ సినిమాతో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు జానకి గారి ఫ్రెష్ వాయిస్ బాగుంటుందని భావించి, లెజెండరీ సింగర్ ఘంటసాల గారితో కలిసి “నీ ఆశ అడియాశ చేయజారే మణిపూస” అనే తొలి పాటను పాడించారు. ఘంటసాల గారి లాంటి మహా గాయకుడి పక్కన ఏమాత్రం బెరుకు లేకుండా పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ‘బావ మరదళ్లు’ సినిమాలో “నీలి మేఘాలలో గాలి కెరటాలలో” అనే పాటతో జానకి గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయారు.

https://www.youtube.com/watch?v=AfKwxi_dTlU

జానకి గారి గాత్రంలో ఉన్న అతిపెద్ద ఆయుధం ఆవిడ మిమిక్రీ కళ మరియు అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్. 3 ఏళ్ల చిన్నారి గొంతు నుండి 90 ఏళ్ల ముసలావిడ గొంతు వరకు ఏ వయసు వారైనా సరే, ఆ పాత్రకు తగినట్టుగా గొంతు మార్చి పాడటం ఆవిడకే చెల్లింది. ‘సప్తపది’లో “గోవుల్లో తెల్లనా” పాటలో చిన్న చిన్న పిల్లల హావభావాలను, ‘జ్యోతి’ సినిమాలో “సిరిమల్లె పువ్వల్లే నవ్వు” పాటలో నవ్వుతూ పాడటాన్ని చూసి ఆవిడకు ‘స్మైల్ స్పెషలిస్ట్’ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇళయరాజా గారి సంగీతంలో తమిళంలో వచ్చిన ఒక సినిమా కోసం కేవలం 16 ఏళ్ల కుర్రాడి గొంతు అప్పుడే మారుతున్న సమయాల్లో ఉండే బ్లెండ్‌ను పలికించడానికి ఆ కుర్రాడితో 15 నిమిషాలు మాట్లాడి, అదే గొంతుతో “పాపా పేరు మల్లి మా ఊరు కొత్త ఢిల్లీ” అనే పాటను అద్భుతంగా పాడి రక్తి కట్టించారు. ఎం.ఎస్. విశ్వనాథన్, చక్రవర్తి, ఇళయరాజా, కేవీ మహదేవన్ వంటి మహామహుల సంగీతంలో ఆవిడ ఎన్నో మైలురాళ్ల లాంటి పాటలు పాడారు.

ఎస్. జానకి గారు తన కెరీర్‌లో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీతో పాటు మొత్తం 17 భాషల్లో దాదాపు 48,000 నుండి 49,000 వరకు పాటలు పాడి భారతీయ చిత్రసీమలో చెరపలేని రికార్డు సృష్టించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మద్రాసుకు వచ్చిన కొత్తలో ఆయన గొంతును చూసి ఇండస్ట్రీకి నీలాంటి వాయిస్ కావాలని ధైర్యం చెప్పిన మొదటి వ్యక్తి జానకి గారే. చక్రవర్తి గారి కాలంలో పాటల్లో అరుపులు, కేకలు, వింత శబ్దాలు యాడ్ చేసినప్పుడు ఎస్పీబీ గారే ఆవిడతో పోటీ పడటానికి భయపడేవారట. జానకి గారు కేవలం పాటలకే పరిమితం కాలేదు, తన ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోలేదు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాన్ని ఆవిడ నిక్కచ్చిగా తిరస్కరించారు. తన స్థాయికి భారతరత్న లాంటి పురస్కారాలు రావాలని, కేవలం ఏదో ఒక పద్మ పురస్కారం ఇచ్చి ఉద్ధరించినట్టు మాట్లాడటం సరికాదని ఆత్మగౌరవంతో నిలబడిన ధీర వనిత ఆవిడ. భర్త రామప్రసాద్, కుమారుడు మురళి మరణంతో చివరి రోజుల్లో కొంత ఒంటరితనానికి గురైనప్పటికీ, దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి గారు ఒక చేజారే మణిపూసగా, ఎప్పటికీ భర్తీ చేయలేని ఒక అద్భుత శకంగా మిగిలిపోయారు.

 

 

S Janaki Biography, Singer Janaki, SP Balasubrahmanyam



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments