- మార్చి 25 నుంచి 27 వరకు విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవం
- శ్రీరామ నవమి వరకు ఇందిరానగర్ ఆలయంలో మండల పూజలు
- వచ్చే నెలలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట
జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణంలోని ఇందిరానగర్లో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం అర్చకులు ‘కళాకర్షణ’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి దివ్య శక్తిని కుంభంలోకి ఆవాహన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. నేటి నుంచి శ్రీరామ నవమి వరకు ఆలయంలో నిరంతరాయంగా మండల పూజలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం, మాతృకా పూజనం, ఆదిత్యాది నవగ్రహ ఆరాధనలు మరియు హోమాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి, వచ్చే నెల (మార్చి) 25, 26, 27 తేదీల్లో స్వామి వారి విగ్రహాల పునఃప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.ఈ పుణ్యకార్యంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు మరియు భక్తులు పాల్గొన్నారు.



