ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే డ్వాక్రా మహిళలకు 2లక్షల వరకు అదనపు రుణాలు.. మిస్ చేసుకోవద్దు!
తెలంగాణా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో లబ్ధిదారులకు కేవలం ఇల్లు మంజూరు చేయడమే కాకుండా, అదనపు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారికి మహిళా సంఘాల (SHG) ద్వారా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి అదనపు రుణాలు
చాలామంది ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్ళ నిర్మాణం ప్రారంభించలేకపోతున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల ఇంటి నిర్మాణం వేగవంతం కావడమే కాకుండా, పేద కుటుంబాలకు ఆర్థిక ఊరట కూడా లభిస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకుంటున్న మహిళలకు వారి అవసరాన్ని బట్టి రుణాలు ఇస్తారు.

మహిళా సంఘాల ద్వారా కోట్ల రూపాయల రుణాలు
అయితే వారి అంతర్గత పొదుపును పరిగణనలోకి తీసుకునే మహిళా సంఘాల ద్వారా కోట్ల రూపాయల రుణాలు అందజేశారు. రుణాలు మూడు మార్గాల్లో అందుతున్నాయి. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, సంఘం అంతర్గత పొదుపు ద్వారా ఈ రుణాలు ఇస్తున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది.
అర్హతను బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం
మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులు మాత్రమే ఈ రుణాలకు అర్హులు. సంఘం సభ్యత్వం, అర్హతను బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. ఈ రుణాన్ని 10 వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు.గతంలో రుణం తీసుకున్నవారైతే ప్రభుత్వం నాలుగు విడతలుగా ఇచ్చే నిధుల నుంచి తగిన మొత్తాన్ని తగ్గించుకుంటారు.
అవసరమైన ఆర్థిక సహాయంతో పేదల సొంతింటి కల సాకారం
గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకే కాకుండా మున్సిపాలిటీల్లోని లబ్ధిదారులకు కూడా ఈ సౌకర్యం కల్పించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం ఇల్లు ఇవ్వడమే కాకుండా, నిర్మాణం సాఫీగా జరిగేందుకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందిస్తోందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అదనపు ఋణం నిరుపేదలైన వారికి వారి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

