- గోశాల ఆధ్వర్యంలో రైతులకు కోడెల పంపిణీ
- వ్యవసాయానికి పాత రోజులు రావాలి
- ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూర్: రైతే రాజు కావాలని, మన సంప్రదాయ వ్యవసాయానికి మళ్ళీ పాత రోజులు రావాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అర్హులైన రైతులకు లాటరీ పద్ధతి ద్వారా కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి అర్హులైన రైతులకు కోడెలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గోశాల నిర్వహించే ఇటువంటి పవిత్రమైన కార్యక్రమంలో ఆయనను భాగస్వామిని చేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో గోశాలకు కీ.శే. శెట్టి అమిత్ అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
రైతులు ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలపై ఆధారపడటం తగ్గించి, పశువులతో కూడిన పాతకాలపు సంప్రదాయ సేద్యం వైపు మళ్లాలని ఆయన ఆకాంక్షించారు. రసాయనిక ఎరువులు స్వస్తి చెప్పి, సహజ సిద్ధమైన సేంద్రీయ పద్ధతుల్లో పంటలు పండిస్తే భూసారం పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తాయని పేర్కొన్నారు. పంపిణీ చేసిన జీవాలను రైతులు సరిగ్గా సద్వినియోగం చేసుకుని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాండూరు గోశాల సేవా సమితి మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల బాల్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి మన్ మోహన్ సార్డ, కోశాధికారి పటేల్ విజయకుమార్, సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, కొట్రిక కిరణ్, సుబ్బారావు, 19వ వార్డు కౌన్సిలర్ జుంటుపల్లి వెంకటేష్, న్యాయవాదులు మహేందర్ రెడ్డి, గుండప్ప తదితరులు పాల్గొన్నారు.
