- వికారాబాద్లో 7,500 కిలోల కల్తీ బెల్లం సీజ్
- బోపనారం వద్ద టాస్క్ఫోర్స్ మెరుపు దాడులు
- ఇద్దరు నిందితుల అరెస్ట్, కేసు నమోదు
జనవాహిని ప్రతినిధి వికారాబాద్: జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీ కల్తీ, కుళ్లిపోయిన బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా ఆధ్వర్యంలో బంట్వారం మండలం బోపనారం గ్రామ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఒక ఆటోలో తాండూర్ వైపు అక్రమంగా తరలిస్తున్న సుమారు 4 క్వింటాళ్ల కల్తీ బెల్లాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆటోలో ప్రయాణిస్తున్న చంద్ పాషా, డ్రైవర్ మొహమ్మద్ కుతుబొద్దీన్లను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి దుకాణంలో కూడా భారీగా కల్తీ నిల్వలు ఉన్నట్లు బయటపడింది. వెంటనే దుకాణంపై దాడి చేసి, ఆటోలోని సరుకుతో కలిపి మొత్తం 7,500 కిలోల (7.5 టన్నుల) కల్తీ, కుళ్లిపోయిన బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బెల్లాన్ని బంట్వారం పోలీస్ స్టేషన్కు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా కల్తీ నిల్వలపై నిఘా కొనసాగుతుందన్నారు. ప్రజలకు కల్తీ వ్యాపారుల గురించి ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన కోరారు.
