- హింసాత్మక రాజకీయాలు తగవు
- టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజు
- ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో గొడవ సరికాదు
- గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త మెహీజ్ కు పరామర్శ
జనవాహిని ప్రతినిధి తాండూరు: శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమాలను రాజకీయ కుట్రలకు వేదికగా మార్చే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తాండూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాతుల నాగరాజు అన్నారు. స్థానిక ఇందిరమ్మ రాజీవ్ కాలనీలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన సందర్భంగా అభిమానులు నిర్వహించిన వేడుకల్లో చోటుచేసుకున్న ఘటనలపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ జావీద్ అనుచరులు వేడుకల వద్దకు వచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలతో సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా ప్రచారం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త మెహీజ్ను మున్సిపల్ చైర్పర్సన్ నీరజబాల్ రెడ్డి, నాగరాజుతో పాటు పలువురు కౌన్సిలర్లు పరామర్శించి, పార్టీ పూర్తి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.ఎమ్మెల్యే వారంలో నాలుగు రోజులు తాండూర్లో ప్రజలకు అందుబాటులోనే ఉంటారని, అభివృద్ధిపై ప్రశ్నించాలనుకుంటే అప్పుడే ఎందుకు ముందుకు రాలేదని నాగరాజు నిలదీశారు. పుట్టినరోజు వేడుకల సమయంలోనే రచ్చ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.





