“చీ.. వాంతి వచ్చేలా ఉంది”: జెన్ జీ నిరసనలపై కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్
నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఈ నిరసనలకు సంబంధించిన సోషల్ మీడియాలో రీల్స్ వైరల్ అవుతుండగా.. ఈ జెన్ జీ రీల్స్ పై ఆమె సంచలన కామెంట్స్ చేశారు. నిరసనకారుల భాష, ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతూ కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో వరుస పోస్టులు చేశారు.
జెన్ జీ నిరసనలపై తీవ్ర ఆగ్రహం
నిరసనల్లో పాల్గొన్న యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ అత్యంత ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. ఆందోళనలకు సంబంధించిన రీల్స్ చూస్తుంటే తనకు అసహ్యం వేస్తోందని.. వారి భాష, మాట్లాడే తీరు వికారం, వాంతి వచ్చేలా ఉన్నాయని కంగన విమర్శించారు. తన జీవితంలో ఒకే చోట ఇంతటి వికృతమైన వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.

ఇండియా హుందాతనంతో కూడిన సంస్కృతికి నిలయమని, కానీ ఈ తరంలో కొందరు తమను తాము ‘బొద్దింకలు’ అని పిలుచుకుంటూ నిజంగానే మురికిగా ప్రవర్తిస్తున్నారని కంగనా రనౌత్ తీవ్రంగా విమర్శించారు. నిరసన తెలుపుతున్న యువత పెంపకాన్ని ప్రశ్నిస్తూ.. “ఛీ.. వీరికి జన్మనిచ్చి పెంచుతున్నది ఎవరు?” అని ప్రశ్నించడమే కాకుండా.. ఈ రీల్స్ చూసి మనస్తాపానికి గురయ్యానని, తనకు డిజిటల్ డిటాక్స్ అవరసరమని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కంగనా రనౌత్ పేర్కొన్నారు.
మరో పోస్టులో కంగనా రనౌత్ నిరసనల్లో పాల్గొంటున్న హిందూ మహిళల ప్రవర్తనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిజమైన స్వతంత్ర మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా నిలబడుతారని.. కానీ వీరు మాత్రం తల్లిదండ్రులపై ఆధారపడుతూ పాశ్చాత్య ధోరణులను అసభ్యకరంగా అనుకరిస్తున్నారని కామెంట్ చేశారు. వారిని జనరేషన్ గట్టర్ అని అభివర్ణిస్తూ.. అటువంటి వారు చదువులో కానీ ఇంటిపనుల్లో కానీ రాణించలేరని.. బాధ్యతలేని స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
#KanganaRanaut shares a sharp message on protests
BJP MP Kangana Ranaut,in an Instagram story,said those who speak out and take actions against public property or use abusive language should be ready to face reactions. She wrote,“Every action has an equal and opposite reaction.” pic.twitter.com/Qs66jB0qRA— Smriti Sharmaa (@SmritiSharma_) July 28, 2026
కంగనా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. క్షమాపణలు డిమాండ్
కంగనా రనౌత్ చేసిన కామెంట్లపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ కంగనా వాడిన భాషను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంటుందని.. జెన్ జెడ్ తరానికి ఆమె తక్షణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ ఎంపీగా ఉంటూ యువతపై ఇటువంటి నీచమైన పదజాలాన్ని ఉపయోగంచడాన్ని ప్రధాని మోదీ గమనించాలని ఆయన కోరారు.


