ఓటీటీలోకి ‘నాగబంధం’ మూవీ.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్
భారీ అంచనాలతో జులై 3న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ‘నాగబంధం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ కర్ణ కీలక పాత్రలో నటించాడు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా మెరిశారు. అలాగే ఈ చిత్రంలో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళి శర్మ, దక్ష నాగర్కర్, రిషభ్ సాహ్ని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి అభిషేక్ నామ దర్శకత్వం వహించారు. నికి స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి జునైద్ కుమార్- అభే సంయుక్తంగా సంగీతం అందించారు.
ఈ మూవీ రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసినప్పటికీ విడుదలైన తర్వాత థియేటర్లలో ఆశించినంత విజయం సాధించలేకపోయింది. పేలవమైన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా సినిమా బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో లోపాలు, భారీ రన్ టైమ్ కారణంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దాంతో అనుకున్న విధంగా థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

పురాతన విష్ణు ఆలయాలు, ‘నాగబంధం’ రహస్యాలు, బ్రహ్మ కమలం చుట్టూ తిరిగే ఈ మైథలాజికల్ అడ్వెంచర్ కథను థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ జూలై 24న ప్రముఖ ఓటీటీ మాధ్యమం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో విఫలం అయిన ఈమూవీ ఓటీటీలో ఎలాంటి స్పందన రాబడుతుందో వేచి చూడాలి.