JEE ఫెయిల్యూర్ – సీన్ కట్ చేస్తే IIT మద్రాస్ డైరెక్టర్, జేఈఈ ఛైర్మన్..!
మన దేశంలో ప్రతిష్టాత్మక విద్య సంస్థలుగా భావించే ఐఐటీ (IIT)ల్లో ప్రవేశాల కోసం ప్రతీ ఏటా లక్షల మంది విద్యార్ధులు అహోరాత్రులు కష్టపడుతున్నారు. వారితో పాటు తల్లితండ్రులు కూడా నిద్రాహారాలు మాని పిల్లల ఐఐటీ కల నెరవేర్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రయత్నంలో విజయం సాధించేది చాలా తక్కువ మందే. వారి గురించి ఎలాగో అందరూ మాట్లాడుకుంటారు. కానీ విఫలమైన మెజార్టీ విద్యార్ధుల్ని మాత్రం తక్కువ మందే గుర్తుంచుకుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రస్తుత ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, జేఈఈ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వి. కామకోటి (V Kamakoti). ఆయనది ఓ స్ఫూర్తిదాయక ప్రస్ధానం.
‘ది బెటర్ ఇండియా’ నివేదిక ప్రకారం కామకోటి 1985లో జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కానీ ఇతర ఫెయిల్యూర్ విద్యార్దుల్లా ఆయన నిరాశపడలేదు. పట్టుదలతో తన లక్ష్యం దిశగా సాగారు. చివరకు ఆయన పట్టుదల ఐఐటీ మద్రాస్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ , పీహెచ్డీ డిగ్రీలను సాధించేలా చేసింది. 2001లో ఐఐటీ మద్రాస్ (IIT Madras) లో ప్రొఫెసర్ గా చేరిన కామకోటి.. విద్యాపరమైన, పరిపాలనాపరమైన రంగాలలో ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన తర్వాత 2022లో డైరెక్టర్ బాధ్యతలను చేపట్టారు. తన సుదీర్ఘ కెరీర్ లో కామకోటి .. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ , వీఎల్ఎస్ఐ డిజైన్లో నైపుణ్యం సంపాదించారు.

ప్రస్తుతం కామకోటి ఐఐటి మద్రాస్ మైక్రోప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ , ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ రెండింటికీ ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తోంది. ఇన్స్టిట్యూట్లోని తన పనితో పాటు, ఆయన జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నారు. గతంలో ఇదే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కు కూడా అధ్యక్షత వహించారు. పరిశోధన, సాంకేతికత , ఉన్నత విద్యారంగాలకు కామకోటి చేసిన సేవలకు గాను డిఆర్డిఓ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ టెక్నో విజనరీ అవార్డు, అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్, ఏసీసీఎస్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డు, వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డులు అందుకున్నారు.
Credit : Economic Times


