కాక్రోచ్ ల వీడియోలు డిలీట్ చేయండి- విద్యార్ధులకు మరో ఐఐటీ ఆదేశం..!
నీట్ సహా జాతీయ స్థాయి పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావం ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ఉన్నత విద్యాసంస్థలపై పడుతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీలపైనా జంతర్ మంతర్ నిరసనల ప్రభావం కనిపిస్తోంది. కాక్రోచ్ ల నిరసనలకు మద్దతుగా ఐఐటీల విద్యార్ధులు కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున వీడియోలు షేర్ చేస్తున్నారు.
కాక్రోచ్ లకు మద్దతుగా విద్యార్ధులు షేర్ చేస్తున్న వీడియోలతో ఐఐటీలు ఇరుకునపడుతున్నాయి. వీటి వల్ల తమ ఐఐటీలకు ఉన్న పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతోందని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీరిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మద్రాస్ ఐఐటీ (IIT Madras) తమ విద్యార్ధులకు ఇన్ స్టా గ్రామ్ లో కాక్రోచ్ లకు మద్దతుగా షేర్ చేసిన వీడియోలు, పోస్ట్ లు డిలీట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఐఐటీ రూర్కీ ఇచ్చిన ఇలాంటి ఆదేశాలపై రచ్చ జరుగుతోంది. అలాగే క్యాంపస్ నిబంధనలు, భావప్రకటనా స్వేచ్ఛపైనా చర్చ మొదలైంది.

విద్యార్థుల నిరసనలకు మద్దతుగా పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోలను తొలగించమని యూనివర్సిటీ కోరినట్లు ఓ విద్యార్ధి తెలిపారు. డీన్ ఆదేశాలను పాటించమని తమను కోరారని ఆ విద్యార్థి వెల్లడించాడు. తమ ఫ్యాకల్టీ అడ్వైజర్ను పిలిచారని, జంతర్ మంతర్ నిరసనకు సంఘీభావం, వాంగ్చుక్ మరియు నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం, విద్యార్థుల ప్రాణాలు విలువైనవి, మొదలైనవి అని రాసి ఉన్న బ్యానర్ను విద్యార్థులు పట్టుకున్న ఒక చిన్న వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయింది, దీని తరువాత ఐఐటి మద్రాస్ దీనిపై దృష్టి సారించింది.

