74 ఏళ్ల తర్వాత కనిపించిన విమానం. మిస్టరీ ఫ్లైట్ దొరికేసినట్లేనా?
అర్ధ శతాబ్దానికి పైగా సముద్రపు అగాధంలో చిక్కుకుని, చరిత్ర పుటల్లో కలిసిపోయిందనుకున్న ఒక ఘోర విమాన ప్రమాద రహస్యాన్ని ఆధునిక సాంకేతికత వెలుగులోకి తెచ్చింది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏకంగా 74 సంవత్సరాల క్రితం మునిగిపోయిన ‘పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్’ విమాన శకలాలను పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఈ చారిత్రక శోధన కేవలం పాత మిస్టరీని ఛేదించడమే కాకుండా, ప్రపంచ విమానయాన చరిత్రలోనే అత్యంత పెద్ద చిక్కుముడిగా మారిన ‘మలేషియా ఎయిర్లైన్స్ MH370’ విమాన జాడ కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల్లో నూతన ఆశలను చిగురింపజేసింది.
ప్రమాదం ఎలా జరిగింది?
అది 1952 ఏప్రిల్ 11. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్ ఎయిర్పోర్ట్ నుంచి 64 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో న్యూయార్క్ వెళ్తున్న ‘పాన్ అమ్ ఫ్లైట్ 526A’ (డగ్లస్ DC-4) విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక లోపానికి గురైంది. ఇంజిన్లు ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అవ్వడంతో పైలట్ అత్యవసరంగా సముద్రంలో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.ల్యాండింగ్ సమయంలో తోక భాగం విరిగిపోయినా, కేబిన్ పటిష్టంగా ఉండటంతో అందరూ ప్రాణాలతోనే ఉన్నారు.

అయితే, ప్రయాణికులకు లైఫ్ జాకెట్ల వినియోగం, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సరిగా తెలియకపోవడం, బాషాపరమైన ఇబ్బందుల వల్ల కొద్ది నిమిషాల్లోనే విమానం నీటమునిగింది. అందులో 17 మంది మాత్రమే రక్షించబడగా, 39 మంది నీటిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాతనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని విమానాల్లో ప్రయాణానికి ముందు కచ్చితంగా సేఫ్టీ డెమో ఇవ్వడం తప్పనిసరి చేశారు.
అట్లాంటిక్ అడుగున శకలాలు.. 30 గంటల ఆపరేషన్!
దశాబ్దాలుగా ఆచూకీ లేని ఈ విమానం కోసం ‘ఎయిర్/సీ హెరిటేజ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు రస్ మాథ్యూస్ నేతృత్వంలో ఒక బృందం సుదీర్ఘ అన్వేషణ సాగించింది. ప్రైవేట్ అండర్సీ అన్వేషణ సంస్థ ‘డీప్ సీ విజన్’ అధినేత టోనీ రోమియో, తన బృందం సముద్రంలో దాదాపు 2,000 అడుగుల లోతులో సోనార్ స్కానింగ్, అత్యాధునిక కెమెరాల సహాయంతో తనిఖీలు చేపట్టారు.
దాదాపు 3.5 లక్షల ఫోటోలను విశ్లేషించి, 30 గంటల శ్రమ తర్వాత విమాన శకలాలను స్పష్టంగా గుర్తించారు. విమాన రెక్కలపై ఉన్న ‘PAA’ ఆనవాళ్లు, బ్లూ గ్లోబ్ లోగో ఆధారంగా అది 1952 నాటి విమానమేనని నిర్ధారించారు. విమానాన్ని బయటకు తీయకుండా ఆ ప్రాంతాన్ని స్మారక ప్రదేశంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
‘MH370’ మిస్టరీకి మళ్లీ చిగురించిన ఆశలు!
ఈ తాజా విజయం, 2014 మార్చి 8న 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ ‘MH370’ వెతకడానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. సాంకేతికత ఎంత ఆధునికంగా మారినప్పటికీ, దశాబ్దాల క్రితం మునిగిపోయిన విమానాలనే వెతికి పట్టుకోగలమని ఈ ఘటన నిరూపించింది.
మలేషియా ప్రభుత్వం ఇప్పటికే ‘ఓషన్ ఇన్ఫినిటీ’ అనే సముద్ర రోబోటిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, విమానం లభ్యమైతేనే రుసుము చెల్లించే ప్రాతిపదికన వేటను కొనసాగిస్తోంది. ఎంతకాలం గడిచినా సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర గర్భంలో దాగి ఉన్న సత్యాలను బయటకు తీయవచ్చని ఈ ఘటన చాటిచెబుతోంది.

