- తాండూరు లో బియ్యం‘మాఫియా
- దర్జాగా సేకరించి సరిహద్దులు దాటిస్తున్న దళారులు
- నామమాత్రంగా మారిన టాస్క్ ఫోర్స్.. కన్నుమూసిన పోలీసులు!
- వచ్చే నెలలో 3 నెలల కోటా ఒక్కసారిగా రానుండటంతో పెరిగిన అక్రమార్కుల కన్ను
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ప్రాంతంలో పీడీఎస్ బియ్యం దందా జోరుగా కొనసాగుతుంది. నిరుపేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమార్కులు వ్యాపార వనరుగా మార్చుకుంటున్నారు. దర్జాగా రేషన్ బియ్యన్ని సేకరించి అక్రమ రావణకు పాల్పడుతున్నారు. ఎటువంటి భయం లేకుండా ఏకంగా గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ, ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.ప్రభుత్వం ఎంతో వ్యయంతో, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం’ పథకం ఈ మాఫియా చేతిలో పక్కదోవ పడుతుండటంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన టాస్క్ ఫోర్స్ విభాగం, జాడ లేకుండా పోయిందని, స్థానిక పోలీసుల పర్యవేక్షణ కరువైందని ప్రజలు మండిపడుతున్నారు. నిఘా వ్యవస్థల నిర్లక్ష్యమే దళారులకు వరంలా మారిందని, అధికారుల కనుసన్నల్లోనే ఈ పీడీఎస్ దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వచ్చే నెలలో లబ్ధిదారులకు దాదాపు మూడు నెలల పీడీఎస్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు మరింత విజృంభించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వదిలి, తాండూరులో ప్రత్యేక తనిఖీలు చేపట్టి పీడీఎస్ బియ్యం రవాణాను అరికట్టాలని, అక్రమార్కులపై కఠిన కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.