- ఓటు హక్కు పరిరక్షణ బిఎల్ఎ ల బాధ్యత
- అర్హులైన ప్రతి ఒక్కరి ఓటూ జాబితాలో ఉండాలి
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు: ఓటు హక్కు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని, ప్రతి ఒక్కరి ఓటును పరిరక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత బూత్ స్థాయి ఏజెంట్ల దేనని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.తాండూరులోని క్యాంప్ కార్యాలయంలో పట్టణ బిఎల్ఎ లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియపై బిఎల్ఎ లకు, నాయకులకు పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో బిఎల్ఎ ల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదని, రాబోయే 10 రోజుల పాటు ప్రతి ఒక్కరూ అంతే అంకితభావంతో పనిచేయాలని కోరారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా పొరపాటున లేదా సాంకేతిక కారణాలతో జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి బిఎల్ఎ నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.బిఎల్ఎ లు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు సర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హులైన వారి నుంచి అవసరమైన దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయించి నమోదు చేయించాలని సూచించారు. ప్రతి బూత్, వార్డు స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఓటర్లకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.ఈ సమీక్షా సమావేశంలో టీపీసీసీ సర్ పర్యవేక్షకులు కోటం వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, పార్టీ సర్ కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజు తో పాటు పలువురు స్థానిక కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, బిఎల్ఎ లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.