బండ్ల గణేష్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్!
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్కు తన కుటుంబ ఆస్తి వేలానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. చెల్లించని రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు ఆస్తిని వేలం వేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలో జోక్యం చేసుకోవడానికి మంగళవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. బ్యాంక్ తీసుకున్న చర్యల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో బండ్ల గణేష్ తాను కోరుకున్న ఉపశమనం పొందలేకపోయాడు.
కోర్టు రికార్డుల ప్రకారం.. బండ్ల గణేష్, అతని కుటుంబం హైదరాబాద్కు చెందిన శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరు మీద రుణం తీసుకున్నారు. ఈ రుణానికి పూచీకత్తుగా తమ సొంత ఆస్తులను మార్ట్ గేజ్ పద్ధతిలో బ్యాంకుకు తాకట్టు పెట్టారు. ఆ సంస్థ రుణం తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో బ్యాంకు తన బకాయిలను వసూలు చేసుకోవడానికి ఆ ఆస్తులను వేలం వేసింది.

బండ్ల గణేష్ రుణ వసూలు ట్రిబ్యునల్ (DRT)లో వేలాన్ని సవాలు చేశారు. ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చి, వేలాన్ని రద్దు చేసి, ఆస్తిని తిరిగి ఇవ్వాలని బ్యాంకును ఆదేశించింది. వేలం కొనుగోలుదారునికి అసలు మొత్తాన్ని వడ్డీతో సహా వాపసు చేయాలని కూడా అది ఆదేశించింది. అయితే యూనియన్ బ్యాంక్ ఆ ఉత్తర్వును తెలంగాణ హైకోర్టులో సవాలు చేయగా.. కోర్టు బ్యాంకుకు అనుకూలంగా తీర్పునిచ్చి వేలం చెల్లుబాటు అవుతుందని నిర్ధారించింది.
అనంతరం బండ్ల గణేష్ హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీని అర్థం ఆస్తికి సంబంధించి బ్యాంకు నిర్వహించిన వేలం చెల్లుబాటులో కొనసాగుతుంది.సులభంగా చెప్పాలంటే, బకాయిలను వసూలు చేసుకోవడానికి వేలం ప్రక్రియను కొనసాగించేందుకు బ్యాంకుకు అనుమతినిస్తూ, బండ్ల గణేష్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

