- విద్యార్థుల ఆత్మహత్యలకు బీజేపీ ప్రభుత్వమే కారణం.
- కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
- కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ ఆగ్రహం
జనవాహిని ప్రతినిధి తాండూరు: దేశంలో నీట్ పరీక్షా పత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న భారీ అవకతవకల వల్లే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ మరణాలకు కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ… నిరుద్యోగం, పరీక్షా వ్యవస్థపై నమ్మకం సడలడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై కిరాతకంగా లాఠీచార్జీ చేయించడం మోదీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందన్నారు.విద్యార్థుల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారికి పూర్తి మద్దతుగా నిలిచారని తెలిపారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కావలి సంతోష్ డిమాండ్ చేశారు.