- ఫలించిన తాండూరు వాసుల యాగాలు, పూజలు
- మంగళవారం కురిసిన వర్షంతో చల్లబడిన వాతావరణం
- పంటలకు జీవం.. రైతన్నల కంట ఆనంద భాష్పాలు
జనవాహిని ప్రతినిధి తాండూరు: భానుడి భగభగలు శాంతించాయి.. ఉక్కపోతకు తెరపడింది.. వర్షపు నీటి చుక్క కోసం ఆకాశం వైపు దినంగా చూసిన రైతుల కంట ఆనందభాష్పాలు కురిసాయి. వరుణ దేవుడికై తాండూరు ప్రజలు చేసిన యాగాలు, ప్రత్యేక పూజలు, ప్రార్థనలు ఎట్టకేలకు ఫలించాయి. బుధవారం సాయంత్రం తాండూరును తాకిన చిరుజల్లులు పట్టణాన్ని చల్లబరచడమే కాకుండా, ప్రజల గుండెల్లో ఆనంద పరవళ్లను తొక్కిచ్చాయి.వానల్లేక ఎండిపోతున్న పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న రైతన్నలకు ఈ వర్షం కొండంత ధైర్యాన్నిచ్చింది. నింగి వైపు ఆశగా చూసిన కళ్లకు చల్లటి వర్షపు చుక్కలు స్వాగతం పలకడంతో రైతుల కంట ఆనంద భాష్పాలు రాలాయి. ఈ వర్షం ఎండిపోతున్న పైర్లకు జీవం పోస్తుందని, తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.పట్టణమంతా చిరు చినుకుల ఆహ్లాదంతో పులకరించిపోయింది. తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభించడంతో చిన్నారులు, యువత చినుకుల్లో తడుస్తూ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. నిన్నటివరకు నిశ్శబ్దంగా ఉన్న వీధులన్నీ ఈనాటి మబ్బుల పలకరింపుతో సరికొత్త కాంతితో మెరిసిపోయాయి.