Accenture: ఉద్యోగులకు యాక్సెంచర్ షాక్..! జీతం పెంపు సంతోషం కాస్తా ఆవిరి..!
అమెరికా ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు తాజాగా జీతాలు పెంచింది. ఓవైపు ఐటీ పరిశ్రమలో లేఆఫ్స్, జీతాలు పెరగకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్న వేళ.. ఉద్యోగులకు ఇది శుభవార్తలాగే కనిపించింది. అయితే తాజాగా పెరిగిన జీతాలు నేరుగా 100 శాతం కొత్త జీతంలో కలిసే అవకాశం లేదని తేలడంతో ఉద్యోగులు షాక్ అవుతున్నారు. దీని వెనుక ఉన్న కారణమేంటో ఓసారి చూద్దాం..
యాక్సెంచర్ తమ ఉద్యోగులకు పెంచిన జీతం మొత్తంలో 100 శాతం జీతానికి కలపకుండా కేవలం 50శాతం మాత్రమే మూలవేతనం (basic pay)కు కలపాలని నిర్ణయించింది. అలాగే మరో 50 శాతం మొత్తాన్ని వెంటనే కాకుండా, తమ వద్దే ఉంచుకుని ఆ తర్వాత ఒక్కసారిగా నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన కాస్త జీతంలో సగం మాత్రమే వెంటనే ఉద్యోగులకు లభించే అవకాశం ఉంది. మిగతా మొత్తం ప్రతీ ఏటా జూన్ నెలలో ఒకేసారి నగదు రూపంలో చెల్లిస్తారు.

మన దేశంలోని సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని యాక్సెంచర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కువ మంది ఉద్యోగులకు మూల వేతన పెంపును అందించే వీలు కల్పిస్తూనే, ఉద్యోగులకు ఒకేసారి ఎక్కువ నగదును అందించేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు సంస్ధ వెల్లడించింది. అలాగే గతేడాది ఒకే హోదాలోకొనసాగిన ఉద్యోగులకు పరిమితంగానే జీతాల పెంపును ఇచ్చినట్లు పేర్కొంది. అయితే ఈ ఏడాది మాత్రం మూల వేతన పెంపుకు అర్హులైన ఉద్యోగుల సంఖ్యను పెంచింది. ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు మాత్రం పాత విధానమే వర్తిస్తుంది. అలాగే డిసెంబర్లో ఇచ్చే వార్షిక బోనస్ కూ, ఈ ఒకేసారి నగదు చెల్లింపుకు కూడా సంబంధం లేదు.

