- విద్యార్థుల మరణాలకు కేంద్రానిదే బాధ్యత..
- విద్యాశాఖ మంత్రి వెంటనే దిగిపోవాలి
- మాజీ ఎన్ఎస్ యూ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగులా ఎబినైజర్
జనవాహిని ప్రతినిధి, తాండూరు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్రమాల వల్లే నీట్ పరీక్షల నిర్వహణ ప్రహసనంగా మారిందని, పత్రాల లీకేజీతో మనోవేదనకు గురై దాదాపు 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని మాజీ ఎన్ ఎస్ యూ ఐ జిల్లా కార్యదర్శి జోగులా ఎబినైజర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ మరణాలకు మోదీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన నిలదీశారు. పారదర్శకంగా జరగాల్సిన పరీక్షా వ్యవస్థలు లీకేజీల మయంగా మారడంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశానిస్పృహల్లోకి నెట్టబడ్డారని ఆవేదన చెందారు. హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జీలు చేయించడం బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థుల తరఫున నిలబడి వారి పోరాటానికి పూర్తినైతిక బలాన్ని ఇస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ స్కామ్పై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, లీకేజీ సూత్రధారులను కఠినంగా శిక్షించాలని జోగులా ఎబినైజర్ డిమాండ్ చేశారు.