- బిఎస్ఆర్ నివాసంలో ప్రముఖుల సందడి..
- అల్పాహార విందులో పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా పట్టణంలో ప్రముఖుల సందడి నెలకొంది. ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహార విందు కార్యక్రమం రాజకీయ, పరిపాలనా వర్గాలలో ఆసక్తి రేకెత్తించింది.తాండూరుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డిలకు శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో ఘన స్వాగతం పలికారు. వారితో పాటు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తదితర ఉన్నతాధికారులు కూడా ఈ విందుకు హాజరయ్యారు. విచ్చేసిన అతిథులందరికీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఈ అల్పాహార విందు అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, తాండూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజా సంక్షేమం, పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్నేహపూర్వక వాతావరణంలో సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ, అధికారిక రంగానికి చెందిన ప్రముఖులందరూ ఒకే వేదికపై కలుసుకోవడంతో ఈ భేటీ స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.