ఒకే విద్యార్ధికి నీట్ రెండో ర్యాంక్- జేఈఈలో 99.5 పర్సెంటైల్..!
మన దేశంలో ఉన్నత విద్యలో రెండు వేర్వేలు స్ట్రీమ్ లు అయిన ఇంజనీరింగ్, వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించి జేఈఈ, నీట్ పరీక్షల్లో కలిపి దాదాపు 40 లక్షలకు పైగా విద్యార్ధులు ప్రతీ ఏటా పోటీ పడుతున్నారు. ఈసారి కూడా నీట్ లో 23 లక్షల మంది, జేఈఈలో 15 లక్షల మంది వరకూ పోటీ పడ్డారు. అయితే వీటిలో ఒక్క పరీక్షలో టాప్ ర్యాంక్ లేదా పర్సంటైల్ కొడితే చాలు భవిష్యత్తు సెటిల్ అయిపోయినట్లేనని తల్లితండ్రులు భావిస్తుంటారు. కానీ ఒకే విద్యార్ధి ఈ రెండు పరీక్షల్లోనూ టాపర్ గా నిలిస్తే..?
ఆ అద్బుతం ఈ ఏడాది జరిగిన జేఈఈ, నీట్ పరీక్షల తర్వాత చోటు చేసుకుంది. ప్రాన్షుల్ (Pranshul) అనే విద్యార్ధి ముందు జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరై 99.5 పర్సంటైల్ సాధించాడు. ఆ తర్వాత నీట్ పరీక్ష రాసి ఏకంగా ఆలిండియా రెండో ర్యాంక్ సాధించాడు. దీంతో ఆశ్చర్యపోవడం మేథావుల వంతు అయింది. ఇంతకీ అతను ఇలా రెండు వేర్వేరు పరీక్షల్ని, అదీ ఒకే ఏడాది ఒకే టైమ్ లో ప్రిపరేషన్ తో రాయడం, టాపర్ గా నిలవడం వెనుక జరిగిన అద్భుతం ఏంటో ప్రతీ విద్యార్ధీ తెలుసుకోవాల్సిందే.

హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన ప్రాన్షుల్ బన్సల్ ఎనిమిదో తరగతిలోనే వైద్యరంగంలోకి ప్రవేశించాలని టార్గెట్ పెట్టుకున్నాడు. సర్జన్ కావాలనే స్పష్టమైన లక్ష్యంతో సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. చిన్నప్పటి నుంచే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలలో బలమైన పునాదులను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాడు. టెన్త్, ఇంటర్ లో స్కూల్ టాపర్ కాకపోయినా అతని పోటీ పరీక్షల ప్రతిభ అతనికి ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు సాధించిపెట్టింది.

జేఈఈ మెయిన్ లో 99.5 పర్సెంటైల్ సాధించిన అతను, ఆ తర్వాత జరిగిన నీట్ యూజీ పరీక్షలో 720కి 715 మార్కులతో ఆలిండియా రెండో టాపర్ గా నిలిచాడు. నీట్ వంటి తీవ్ర పోటీ ఉన్న పరీక్షలో విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసం అతిపెద్ద కారకాల్లో ఒకటి అని ప్రాన్షుల్ చెప్తున్నాడు. కచ్చితమైన టైమ్టేబుల్ను పాటించడంతో పాటు, క్రమం తప్పకుండా గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేసేవాడు. ఇది పరీక్షకు ముందు కాన్సెప్ట్ లను బలోపేతం చేయడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి సాయపడింది.


