AP EAPCET 2026 counselling: ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్-జూలై 20 నుంచి ఇలా..!
ఏపీలో ఈ ఏడాది ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) పరీక్ష పూర్తయి ఫలితాలు కూడా వెలువడ్డాయి. దీంతో పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్దులకు సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ప్రభుత్వం షెడ్యూల్ (AP EAPCET 2026 counselling) విడుదల చేసింది. దీని ప్రకారం విద్యార్దులు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరై తమ సీట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ ఎప్సెట్ అడ్మిషన్లకు ప్రభుత్వం ఇవాళ తొలి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం జులై 20 నుంచి 29 వరకు మొత్తం 10 రోజుల పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం విద్యార్ధులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జులై 22 నుంచి 31 వరకూ చేపడతారు. ఆ తర్వాత జులై 25 నుంచి 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునేందుకు విద్యార్ధులకు అవకాశాన్ని కల్పిస్తారు.

ఆగస్టు 1న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు విద్యార్దలుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం ఆగస్టు 6న తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.ఆ తర్వాత ఆగస్ట్ 7 నుంచి 13వ తేదీ వరకు కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్ / రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ముగిసిన తర్వాత ఆగస్టు10 నుంచి ఆయా కోర్సుల్లో తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్ లో సీట్లు లభించని వారు రెండో విడత కౌన్సిలింగ్ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.

