సింధు జలాల వివాదంలో బిగ్ ట్విస్ట్..! భారత్ బిల్లూ భరిస్తున్న పాకిస్తాన్ ..!
కశ్మీర్లోని పహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్ (Pakistan) కు సింధు జలాల్ని నిలిపేస్తూ దశాబ్దాల నాటి ఒప్పందానికి భారత్ (India) బ్రేక్ వేసింది. అప్పటినుంచీ తాగు, సాగునీరు దొరక్క అల్లాడుతున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం (Indus waters treaty) నిలిపివేతను సవాల్ చేస్తూ శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు (పీసీఏ)ను ఆశ్రయించింది. కానీ భారత్ మాత్రం ఈ కోర్టును, దాని విచారణలను ఎప్పటి నుంచో గుర్తించడం లేదు. దీంతో పాకిస్తాన్ ఏకపక్షంగా ఈ కోర్టులో మధ్యవర్తిత్వం కోసం పోరాటాలు చేస్తోంది. అందులోనే మరో ట్విస్ట్ ఎదురైంది.
సింధు జలాల వివాదంలో ట్విస్ట్ (indus waters treaty)
శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతను సవాల్ చేస్తూ పాకిస్తాన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి తీర్పు ఇవ్వాలంటే భారత్ కూడా పాలుపంచుకోవాలి. కానీ భారత్ ఈ కోర్టును గుర్తించకపోవడంతో విచారణకు సైతం దూరంగా ఉంటోంది. అయినా విచారణ కొనసాగించాలంటే పాకిస్తాన్ తమ ఖర్చులతో పాటు భారత్ ఖర్చుల్ని కూడా భరించాలి. ఎందుకంటే ఈ కోర్టు నిబంధనల ప్రకారం విచారణకు చెల్లించాల్సిన ఖర్చుల్ని వాది, ప్రతివాది కూడా పంచుకోవాలి. ఇప్పుడు భారత్ విచారణలో పాలుపంచుకోకపోవడంతో మన బిల్లు కూడా చెల్లించి మరీ పాకిస్తాన్ దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

భారత్ బిల్లూ కట్టేస్తున్న పాకిస్తాన్
పాకిస్తాన్ ఇప్పటికే ఈ విచారణ కోసం 6 లక్షల డాలర్లను చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఇంకా ముందుకు సాగే కొద్దీ ఈ ఖర్చులు తడిసి మోపెడు కావడం ఖాయం. ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియ సింధు జలాల ఒప్పందం పరిధిలోకి వచ్చే పశ్చిమ నదులపై భారత్ చేపట్టిన కిషన్గంగ , రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించినది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భారత్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ, పాకిస్థాన్ శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం కోరింది. అయితే, ఇలాంటి సాంకేతిక విభేదాలను మధ్యవర్తిత్వ న్యాయస్థానం కాకుండా, తటస్థ నిపుణులు పరిశీలించాలని భారత్ వాదిస్తోంది.

ఏదో చేయబోతే ఎటో తిరిగి బ్యాక్ ఫైర్
మరోవైపు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం వివాదంపై తమకు అధికార పరిధి ఉందని ట్రిబ్యునల్ నిర్ధారిస్తే..ఓ వర్గం పాల్గొనకూడదని నిర్ణయించుకున్నప్పటికీ ప్రక్రియను కొనసాగవచ్చు. భారత్ అభ్యంతరాలు ఉన్నా, పాకిస్తాన్ కేసును విచారించే అధికారం తమకు ఉందని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇప్పటికే తీర్పు ఇచ్చింది. అయినా భారత్ ట్రిబ్యునల్ అధికార పరిధిని గుర్తించకుండా ఈ ప్రక్రియకు దూరంగా ఉంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కొనసాగాలని కోరుకుంటున్నంత కాలం, భారత్ హాజరు కానంత కాలం, ఈ విచారణ పూర్తి ఖర్చును భరించడం తప్ప ఇస్లామాబాద్కు మరో మార్గం లేదు.


