- మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో తాండూరుకు చేసిందేమీ లేదు
- కమిషన్ల కోసమే రూ.290 కోట్ల నిధుల డ్రామా
- హామీలు నెరవేర్చకుండా పర్యటనలా?
- మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : శనివారం తాండూరు నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రులను అడ్డుకుని, నిలదీస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని వారు మండిపడ్డారు.ఈ సందర్భంగా ….ఎన్నికల సమయంలో పేద ప్రజలకు మాయమాటలు చెప్పి, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పటివరకు వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా, కేవలం కొన్ని ప్రైవేట్ జీవోలను చూపిస్తూ అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.తాండూరు నియోజకవర్గ వికాసం కోసం రూ. 290 కోట్లు తీసుకువచ్చామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ఈ నిధులు కేవలం కమిషన్ల కోసమే తెచ్చుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను మోసం చేస్తున్న పాలక పక్ష నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి పర్యటనలకు వస్తున్న మంత్రులను రేపు తాండూరు గడ్డపై అడ్డుకుంటామని బిఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వెల్లడించారు.