- 8వ వార్డులో చెత్త డబ్బాలు ఏర్పాటు చేసిన కౌన్సిలర్ జావిద్
- పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి
- ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్లపై బీఆర్ఎస్ కౌన్సిలర్
జనవాహిని ప్రతినిధి తాండూరు :కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలగకుండా చూడటంలో తన చిత్తశుద్ధిని చాటుకున్నారు తాండూరు పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్. పట్టణంలోని 8వ వార్డు పరిధిలో గల రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో మున్సిపాలిటీ నిధులతో సంబంధం లేకుండా, ఆయన తన సొంత ఖర్చులతో చెత్త డబ్బాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం రాజీవ్ కాలనీలో చెత్త డబ్బాల ఏర్పాటు పనులను ఆయన దగ్గరుండి చేయించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ, రాజీవ్ కాలనీల వాసులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కాలనీల్లో చెత్త పేరుకుపోయి రోగాలు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా.. తొలి విడతలో 10 పెద్ద చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ చెత్తను రోడ్లపై వేయకుండా, ఈ డబ్బాలను వినియోగించుకొని కాలనీల స్వచ్ఛతకు సహకరించాలని సూచించారు.ఇదే సమయంలో స్థానిక అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యేకు, మున్సిపల్ చైర్పర్సన్కు కనీస శ్రద్ధ లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి, అభివృద్ధిని కేవలం మాటలకే పరిమితం చేశారని మండిపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే తానే స్వయంగా నిధులు వెచ్చించి ప్రజాసమస్యల పరిష్కారానికి పూనుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జ్, స్థానిక యువకులు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.







