- 36వ వార్డులో ‘ఎస్ఐఆర్’ ఎన్యుమరేషన్ కేంద్రం ఏర్పాటు
- ప్రజల సౌకర్యార్థం దయానంద్ స్కూల్లో ప్రత్యేక కేంద్రం
- అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: వార్డు కౌన్సిలర్ రూప రుద్రు పాటిల్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 36వ వార్డు ప్రజల సౌకర్యార్థం ‘ఎస్ఐఆర్’ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను నింపేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వార్డు కౌన్సిలర్ రూప రుద్రు పాటిల్ తెలిపారు. వార్డులోని స్థానిక దయానంద్ పాఠశాల లో ఈ ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ రూప రుద్రు పాటిల్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియలో వార్డు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సులువుగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫారాలు నింపే సమయంలో ప్రజలకు వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి, వారికి అవసరమైన సాంకేతిక సహాయం అందించడానికి కేంద్రంలో ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.36వ వార్డు పరిధిలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి వచ్చే వారు తమ వెంట ఆధార్ కార్డ్, అవసరమైన గుర్తింపు కార్డులు మరియు సహాయక పత్రాలను తీసుకురావాలని, తద్వారా ఎలాంటి తప్పులు లేకుండా నమోదు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని సూచించారు. వార్డు ప్రజలందరూ సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆమె కోరారు.






