పెట్రోల్కు గుడ్బై చెబుతున్న ఇండియా.. వాటి కోసం 6 నెలల్లోనే 10 లక్షల మంది షోరూమ్కు క్యూ
ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్స్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. గతంలో పెట్రోల్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవారు క్రమంగా ఇప్పుడు ఈవీల వైపు మళ్లుతున్నారు. దీనికి ప్రధాన కారణం, పెరుగుతున్న ఇంధన ధరలు, అలాగే ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు మెరుగవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. తాజాగా ఈవీ విప్లవం మరింత వేగం అందుకుంది. 2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే దేశీయ ఈవీ మార్కెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని దాటింది. సమాచారం ప్రకారం, ఈ ఏడాది ప్రారంభం నుంచి జూలై 6 నాటికే దేశవ్యాప్తంగా మొత్తం 10,05,279 ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్ముడుపోయి కొత్త రికార్డును నమోదు చేసింది.
ఏడాది మొదటి ఆరు నెలల కాలంలోనే 10 లక్షల అమ్మకాల మార్క్ను దాటడం ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకాన్నిచూపిస్తుంది. ఈ మొత్తం అమ్మకాలలో మెజార్టీ వాటా ఎలక్ట్రిక్ స్కూటర్లదే కావడం విశేషం. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చు, పెరుగుతున్న ఛార్జింగ్ సదుపాయాలు, మంచి రేంజ్, అధునాతన ఫీచర్లు వంటి కారణాలతో వినియోగదారులు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈవీ బైకుల వాటా తక్కువగా ఉంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొత్తం ఈవీ టూవీలర్ అమ్మకాలలో దాదాపు 83 శాతం కేవలం 5 ప్రముఖ తయారీ సంస్థల నుంచే నమోదైంది. మార్కెట్లో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, ప్రముఖ బ్రాండ్లు తమ బలమైన డీలర్ నెట్వర్క్, వినియోగదారుల నమ్మకంతో అగ్రస్థానాలను కొనసాగిస్తున్నాయి. టీవీఎస్, బజాజ్, ఏథర్ ఎనర్జీ, హీరో (వీడా), ఓలా ఎలక్ట్రిక్ కలిసి జూలై 6 నాటికి సుమారు 8.39 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్స్ను విక్రయించాయి.
ఈ 5 కంపెనీలే భారత ఈవీ మార్కెట్కు ప్రధానంగా ఉంటూ, మొత్తం అమ్మకాలలో అత్యధిక వాటాను ఖాతాలో వేసుకున్నాయి. కొత్త మోడళ్లను వరుసగా విడుదల చేయడం, టెక్నాలజీలను నిరంతరం మెరుగుపరచడం, అందుబాటు ధరలు వీటి విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అటు టాప్-5 తర్వాతి స్థానాల్లో ఉన్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, రివర్ మొబిలిటీ, బికాస్, సింపుల్ ఎనర్జీ, రివోల్ట్ వంటి సంస్థలు కూడా మార్కెట్లో తమ ఉనికిని బలపరుస్తున్నాయి.

ఈ ఐదు కంపెనీలు కలిసి ఇప్పటివరకు 1,00,865 ఎలక్ట్రిక్ టూవీలర్స్ను విక్రయించాయి. ఈ డిమాండ్ ఇలాగే కొనసాగితే, 2026 సంవత్సరం ముగిసే సమయానికి మొత్తం 20 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్మకాలను దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా జరిగితే, ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 20 లక్షల ఈవీ టూవీలర్స్ విక్రయించిన తొలి సంవత్సరంగా 2026 చరిత్రలో నిలిచిపోతుంది.
మార్కెట్లో టీవీఎస్, బజాజ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు కంపెనీలు కలిసి మొత్తం ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్మకాలలో దాదాపు 48 శాతం మార్కెట్ వాటాను తమ ఖాతాలో వేసుకున్నాయి. అంటే దేశంలో అమ్ముడవుతున్న ప్రతి రెండు ఎలక్ట్రిక్ టూవీలర్స్ దాదాపు ఒకటి ఈ రెండు బ్రాండ్లదే. 2026లో ఇప్పటివరకు టీవీఎస్ టాప్లో ఉంది. సంస్థ మొత్తం 2.61 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి మార్కెట్లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

బజాజ్ తన చేతక్కు పెరుగుతున్న డిమాండ్తో 2026లో ఇప్పటివరకు 2.26 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. టీవీఎస్, బజాజ్ మధ్య పోటీ మార్కెట్ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. మూడో స్థానంలో ఉన్న ఏథర్ ఎనర్జీ 1.74 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగా, నాలుగో స్థానంలో హీరో విడా 1.09 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు తగ్గినప్పటికీ, 68,148 యూనిట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.







