IIIT విద్యార్దికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ- ఐఐటీల్ని మించిపోయి..!
బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT-B) ప్లేస్మెంట్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. సంస్థ నిర్వహించిన 26వ స్నాతకోత్సవంలో ఓ విద్యార్థి ఏకంగా రూ.1.5 కోట్ల భారీ వార్షిక ప్యాకేజీ దక్కించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సు చదివిన ఈ విద్యార్థి అందుకున్న ప్యాకేజీ, దేశంలోని పలు కొత్త ఐఐటీల అత్యధిక ప్లేస్మెంట్ ఆఫర్ల కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.
ఐఐఐటీ బెంగళూరు ప్యాకేజీల పంట (IIIT Bangalore)
ఈ విద్యాసంవత్సరం ప్లేస్మెంట్లలో సత్తా చాటిన ఈ విద్యార్థి మాత్రమే కాకుండా, మరో ఇద్దరు విద్యార్థులు కూడా రూ.1.3 కోట్ల చొప్పున ప్యాకేజీలు సాధించారు. ఇక రూ.60 లక్షల కన్నా ఎక్కువ ప్యాకేజీ దక్కించుకున్న వారిలో 22 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు మరో 27 మంది ఆఫర్లు పొందగా, దాదాపు 110 మందికి పైగా గ్రాడ్యుయేట్లకు రూ.20 లక్షల కంటే ఎక్కువ వార్షిక వేతన ఆఫర్లు లభించాయి.

కొత్త ఐఐటీల కన్నా మిన్నగా ప్లేస్మెంట్లు
దేశంలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ప్లేస్మెంట్లతో పోలిస్తే ఐఐఐటీ బెంగళూరు అత్యంత మెరుగైన ఆఫర్లు సాధించింది. ఉదాహరణకు ఐఐటీ మండిలో అత్యధిక అంతర్జాతీయ ప్యాకేజీ రూ.46.7 లక్షలుగా ఉంటే, ఐఐటీ జోధ్పూర్లో బిటెక్ విద్యార్థి సాధించిన ప్యాకేజీ రూ.56 లక్షలుగా నమోదైంది. ఐఐటీ గోవాలో సగటు ప్యాకేజీ రూ.18.85 లక్షలు మాత్రమే ఉంది. కానీ, ఐఐఐటీ బెంగళూరులో ఏకంగా కోటి రూపాయల మార్కును ముగ్గురు విద్యార్థులు దాటి సరికొత్త చరిత్ర సృష్టించారు.

టెలిమానస్ సేవలు
ఈ ఏడాది డిగ్రీలు పూర్తి చేసిన మొత్తం 316 మంది విద్యార్థులలో 95 మంది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, 175 మంది ఎంటెక్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) విస్తరణలో భాగంగా ఐఐఐటీ బెంగళూరు రూపొందించిన ‘టెలి-మానస్’ (Tele-MANAS) ప్లాట్ఫారమ్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి మానసిక ఆరోగ్య సేవలు అందుతున్నాయని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ దేబబ్రత దాస్ ప్రకటించారు.











