Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ మరో భారీ లేఆఫ్స్- వేల ఉద్యోగులకు షాక్..!
మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. తన ఉద్యోగులలో సుమారు 2.1 శాతం మందిని, అంటే దాదాపు 4,800 మందిని తొలగిస్తోంది. విండోస్ తయారీ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్.. ఏఐ (AI) మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తూ, తన వ్యాపారమంతటా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ టెక్నాలజీని వాడుతున్న నేపథ్యంలో ఇలా ఉద్యోగుల తొలగింపుల్ని చేపట్టింది. పెరుగుతున్న ఖర్చుల్ని భర్తీ చేయాలనే ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం 700 బిలియన్ డాలర్లకు పైగా చేరనున్న బిగ్ టెక్ సంస్థల చారిత్రాత్మక ఏఐ పెట్టుబడులు, ఈ సాంకేతికత నుండి రాబడిని చూపించి, తమ వ్యాపారాలలో దీనిని అమలు చేయడానికి పెరుగుతున్న ఖర్చును భర్తీ చేయాలనే ఒత్తిడిని కంపెనీలపై పెంచుతున్నాయి. ఇదే క్రమంలో అమెజాన్, మెటా ప్లాట్ఫామ్స్ ఈ సంవత్సరం వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఇదే కోవలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా దాదాపు 5 వేల మంది ఉద్యోగులకు చెక్ పెట్టేసింది.

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 23 శాతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ లేఆఫ్స్ ప్రకటించింది. 2022 తర్వాత ఇదే అత్యంత దారుణమైన మొదటి అర్ధభాగ పనితీరుగా నమోదైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో తన యూఎస్ ఉద్యోగులలో సుమారు 7 శాతం మందికి, అంటే దాదాపు 9వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వాలంటరీ బైఅవుట్స్) ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ తరచుగా కొత్త సంవత్సరానికి ఖర్చు ప్రణాళికలను నిర్దేశించుకునే క్రమంలో, జూన్లో తన ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఉద్యోగాలను తగ్గిస్తుంది. ఇప్పుడు చేస్తోంది అదే.









