పోలీస్ స్టేషన్ ముందే ‘చక్రా’బంధం..!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • ఇందిరా చౌరస్తాలో అడ్డగోలుగా వాహనాల పార్కింగ్
  •  రోడ్డు మధ్య వరకు ఆటోలు, బైకుల నిలిపివేత
  •  నరకప్రాయంగా ట్రాఫిక్.. పట్టించుకోని అధికారులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే ఇందిరా చౌరస్తా అస్తవ్యస్తమైన పార్కింగ్‌తో ఊపిరి సలపని స్థితికి చేరుకుంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ముందే వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలుపుతుండటం గమనార్హం.ప్రధాన రహదారిపై డబుల్ వే ఉన్నప్పటికీ, రోడ్డుకు ఇరువైపులా కాకుండా ఏకంగా రోడ్డు మధ్య భాగం వరకు వాహనాలను పార్క్ చేస్తున్నారు. గ్రామాలకు వెళ్లే ఆటోలు, భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలు అడ్డదిడ్డంగా నిలపడంతో విశాలమైన రహదారి కాస్తా ఇరుకైన సింగల్ వేగా మారిపోయింది. దీనివల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది.ఇందిరా చౌరస్తాలోనే బస్సు లు ఆగేందుకు కూడా ఇబ్బంది ఎర్పడుతుంది. రోడ్డు నిండా వాహనాలు పార్క్ చేసి ఉండటంతో ఆర్టీసీ బస్సులు ఆపడానికి చోటు లేక, రోడ్డు మధ్యలోనే నిలుపుతున్నారు. దీంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ప్రాణాలకు తెగించి ట్రాఫిక్ మధ్యలో బస్సులు ఎక్కాల్సి వస్తోంది.పోలీస్ స్టేషన్ కళ్ల ముందే ఇంత జరుగుతున్నా, సిబ్బంది కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగా కూడా ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అడ్డగోలు పార్కింగ్‌ను అరికట్టి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *