- 7వ వార్డులో అవుట్ ఫాల్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
- విభేదాలు లేకుండా 36 వార్డులను అభివృద్ధి చేస్తాం
- వర్షాలు లేవు.. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి
- మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగా మున్సిపల్ నిధులు రూ. 5 కోట్లతో పట్టణంలో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని 7వ వార్డు పరిధిలో గల గాజీపూర్ సలాం భాయ్ ఇల్లు నుండి మెయిన్ రోడ్డు వరకు, అలాగే యూసుఫ్ భాయ్ ఇంటి వరకు రూ. 5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అవుట్ ఫాల్ డ్రైనేజీ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పట్టణంలోని 36 వార్డుల ప్రజలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. వార్డుల అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయ, ప్రాంతీయ విభేదాలకు తావులేకుండా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. పట్టణంలో ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ గుర్తించి ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. నేడు ప్రారంభించిన రూ. 5 కోట్ల డ్రైనేజీ పనులను రోజుకు మూడు వార్డుల చొప్పున వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
ప్రస్తుత సీజన్లో సగం కాలం గడిచిపోతున్నా తాండూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక్క వర్షం కూడా కురవకపోవడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో నీటి ఎద్దడితో పాటు విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా బాధ్యతగా నీటిని నిల్వ చేసుకుంటూ, పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో సకాలంలో వర్షాలు కురిసి తాండూరు ప్రాంతం సస్యశ్యామలం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తాండూరును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రజాక్, వార్డు కౌన్సిలర్ ఇర్షాద్, టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు, సలాం, మున్సిపల్ కమిషనర్, ఏఈలు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.














Leave a Reply