మళ్లీ పరీక్షలు! కామర్స్, ఇంగ్లీష్, సోషియాలజీ పేపర్లు రద్దు..
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘యూజీసీ-నెట్’ నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరు మరోసారి వివాదాస్పదమైంది. తీవ్ర నిర్లక్ష్యం, ఘోర తప్పులతో కూడిన ప్రశ్నపత్రాలను చూసి అభ్యర్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జూన్ 22 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షల్లో వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఎన్టీయే.. ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మూడు కీలక సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి, మళ్లీ రీ-టెస్ట్ నిర్వహించనున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో వెలుగుచూసిన తప్పులు సామాన్యమైనవి కావు. మహామహులైన పండితులు, రచయితల పేర్లనే తప్పుగా అచ్చేశారు. పుస్తకాల పేర్లు అక్షర దోషాలతో నిండిపోగా, ప్రశ్నించే తీరులోనే ఎన్నో వ్యాకరణ లోపాలు, అనువాద పొరపాట్లు దర్శనమిచ్చాయి. కొన్ని ప్రశ్నల్లో అసలు అర్థమే లేని కొత్త పదాలను తయారు చేసి రాశారు. ఇవి చాలవన్నట్లు, పాత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలనే యథాతథంగా కాపీ చేసి పెద్ద సంఖ్యలో ఇచ్చేయడం విశేషం. వీటిపై అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఫిర్యాదులు రావడంతో ఎన్టీయే ఒక నిపుణుల కమిటీని వేసింది. ఆ కమిటీ పరిశీలనలో ఈ ఘోరాలన్నీ నిజమేనని తేలడంతో, ఈ పరీక్షలు ఏమాత్రం ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చి చెప్పేసింది.

మళ్లీ ఎప్పుడంటే..? రీ-టెస్ట్ షెడ్యూల్ ఇదే!
కేవలం కొన్ని తప్పున్న ప్రశ్నలను తొలగించి మార్కులు కలపడం ద్వారా ఈ సమస్య తీరదని గ్రహించిన ఎన్టీయే, ఆ మూడు పేపర్లను పూర్తిగా మళ్లీ నిర్వహించడమే న్యాయమని నిర్ణయించింది. ఈ క్రమంలో రీ-టెస్ట్ తేదీలను కూడా విడుదల చేసింది. సెప్టెంబరు 9న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (షిఫ్ట్-1) ఇంగ్లీష్ పేపర్, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (షిఫ్ట్-2) కామర్స్ పేపర్ జరగనున్నాయి. ఇక సోషియాలజీ పేపర్ సెప్టెంబరు 10న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. ఈ రీ-టెస్ట్ రాసేందుకు విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబోమని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
మిగతా విద్యార్థులకు ఊరట.. ఫలితాలు యథాతథం!
ఈ మూడు సబ్జెక్టుల వివాదం వల్ల మిగతా 84 సబ్జెక్టుల విద్యార్థులకు ఎలాంటి ఆలస్యం జరగకుండా ఎన్టీయే జాగ్రత్త పడింది. మిగిలిన సబ్జెక్టుల జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియను అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా, విద్యార్థుల అర్హత శాతంలో ఎలాంటి కోత పడదని, జూన్ లో రాసిన అభ్యర్థుల సంఖ్య లేదా రీ-టెస్ట్ లో రాసిన వారి సంఖ్య.. రెండింటిలో దేనిలో ఎక్కువగా ఉంటే దాన్నే ప్రామాణికంగా తీసుకుని 6 శాతం అర్హత ఫలితాలు కేటాయిస్తామని వెల్లడించింది. పునఃపరీక్షల తర్వాత ఏ సబ్జెక్టుకూ కేటాయించిన సీట్ల సంఖ్య తగ్గదని హామీ ఇచ్చింది. విద్యార్థులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా కేవలం అధికారిక వెబ్సైట్లనే సంప్రదించాలని కోరింది.

