- కొడంగల్కు తాండూరు ఆసుపత్రి?
- బోధనాసుపత్రిగా మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆందోళన
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమాధానం చెప్పాలి: రాజ్ కుమార్ కందుకూరి
- ఆసుపత్రి హోదా మార్చితే ఊరుకోం.. ప్రజా ఉద్యమం ఖాయం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు జిల్లా ఆసుపత్రి ఉనికికే ప్రమాదం ఏర్పడిందా? కొడంగల్ మెడికల్ కాలేజీ కోసం తాండూరు పేదల వైద్యాన్ని ఫణంగా పెడుతున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు నియోజకవర్గంలో దావానలంలా మారుతున్నాయి. తాండూరు జిల్లా ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ పరిధి నుంచి కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిధిలోని బోధనాసుపత్రిగా మారుస్తున్నట్లు పత్రికల్లో వస్తున్న కథనాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. దీనిపై బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి తీవ్రంగా స్పందించారు. అసలు తాండూరులో జిల్లా ఆసుపత్రి ఉన్నట్టా.. లేనట్టా? అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.దాదాపు రెండు దశాబ్దాలుగా తాండూరుతో పాటు పరిసర ప్రాంతాల వేలాది మంది పేదలు, రైతులు, కార్మికులకు ఈ ఆసుపత్రి ఏకైక దిక్కుగా మారిందని రాజ్ కుమార్ గుర్తుచేశారు. ఒకవేళ దీనిని బోధనాసుపత్రిగా మార్చితే ప్రస్తుతం అందుతున్న అత్యవసర వైద్య సేవలు యథాతథంగా కొనసాగుతాయా? లేదా? అనే దానిపై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. ఆసుపత్రి హోదా, పరిపాలన మార్పులపై ప్రభుత్వం వెంటనే అధికారికంగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో వస్తున్న కథనాలపై స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వెంటనే స్పందించాలని రాజ్ కుమార్ కోరారు. ప్రజల తరఫున నిలబడి.. జిల్లా ఆసుపత్రి యథావిధిగా కొనసాగుతుందని, సేవలలో ఎలాంటి కోత పడబోదని ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాండూరు ప్రజల ఆరోగ్య హక్కులతో ఆడుకుంటే ఊరుకునేది లేదని రాజ్ కుమార్ హెచ్చరించారు. ఆసుపత్రి సేవలను తగ్గించినా, ఇక్కడి ప్రజలకు నష్టం చేకూర్చే ఏ నిర్ణయం తీసుకున్నా సహించబోమన్నారు. అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ శ్రేణులను ఏకం చేసి, తాండూరు ప్రజలతో కలిసి పెద్దఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు.




