హైదరాబాద్ జానవాహిణి ప్రతినిధి :- తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ నేటి నుంచే (జూన్ 25) అధికారికంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే నిరంతరాయంగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. వీరు ప్రతి ఇంటికీ వచ్చి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ (Enumeration Forms) అందజేస్తారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలు, చిరునామా మార్పులు వంటి వాటిని ఈ సర్వే ద్వారా సరిచేసుకోవచ్చు.
ఇంట్లో లేకపోయినా పర్లేదు.. ఆన్లైన్ సదుపాయం!
బీఎల్ఓలు ఇంటికి వచ్చే సమయానికి అందుబాటులో లేని వారు లేదా స్వయంగా నమోదు చేసుకోవాలనుకునే వారి కోసం ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించారు. ఓటర్లు నేరుగా భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ https://voters.eci.gov.in సందర్శించి తమ వివరాలను నమోదు లేదా సవరణ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
కీలకమైన షెడ్యూల్ వివరాలు ఇవే
- ఇంటింటి సర్వే : జూన్ 25 నుండి జూలై 24 వరకు
- చిత్తు జాబితా (Draft List) ప్రకటన: జూలై 31న
- అభ్యంతరాల స్వీకరణ: జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు
- తుది ఓటర్ల జాబితా (Final List) విడుదల: అక్టోబర్ 1న
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.




