- తాండూరు 26వ వార్డులో యుద్ధప్రాతిపదికన పనులు
- కౌన్సిలర్ వైశాలి రాజు చొరవ.. స్పందించిన మున్సిపల్ చైర్మన్
- అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన విజ్ఞానపూరి, సౌకర్పెట్ కాలనీ వాసులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని 26వ వార్డు పరిధిలో గల విజ్ఞానపూరి, సౌకర్పెట్ కాలనీల్లో గత 20 ఏళ్లుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్ సమన్వయంతో చేపట్టిన పనులతో దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గత కొంతకాలంగా విజ్ఞానపూరి, సౌకర్పెట్ ప్రాంతాల్లో గంటపాటు వర్షం కురిసినా డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయేవి. మురికినీరంతా రోడ్లపైకి ప్రవహించడమే కాకుండా, ఇళ్లలోకి కూడా చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ దుస్థితిపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఈ సమస్యను 26వ వార్డు కౌన్సిలర్ ఎన్. వైశాలి రాజు గౌడ్ తీవ్రంగా పరిగణించి.. మున్సిపాలిటీ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కౌన్సిలర్ విన్నపానికి సానుకూలంగా స్పందించిన చైర్మన్, తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి సమస్య మూలాలను అన్వేషించారు. డ్రైనేజీ లైన్లో మిషన్ భగీరథ పైపులు అడ్డంగా ఉండడం, భారీగా వ్యర్థాలు పేరుకుపోయి బ్లాకేజీలు ఏర్పడడం వల్లే నీరు ముందుకు సాగడం లేదని గుర్తించారు. దీంతో గత మూడు రోజులుగా శివాజీ చౌక్ రోడ్డు మార్గంలో జేసీబీలతో డ్రైనేజీ తవ్వకాలు జరిపి, అడ్డంకులను పూర్తిగా తొలగించారు.20 ఏళ్లుగా కాలనీని వేధిస్తున్న సమస్యను కేవలం మూడు రోజుల్లో పరిష్కరించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి, ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్తో పాటు మూడు రోజుల పాటు అహర్నిశలు శ్రమించిన వాటర్ వర్క్స్ సిబ్బందికి కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్, 23వ వార్డు కౌన్సిలర్ కిరణ్, పర్యాద రామకృష్ణ మరియు స్థానిక కాలనీ ప్రజలు పాల్గొన్నారు.




