హైదరాబాద్,జానవాహిణి ప్రతినిధి :- రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో పోరాటాలను మరింత ఉధృతం చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల ఉమ్మడి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యవేక్షకులు అభయ్ పాటిల్ నేతృత్వంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇటీవల పార్టీ చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా” కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని, ధాన్యపు కొనుగోలు ప్రక్రియపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విజయం సాధించామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని అభినందిస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చెప్పారు. అయితే, ప్రభుత్వం రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, మద్దతు ధరల విషయంలో రైతులను వంచిస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడానికి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కలిసి పోరాడుతారని స్పష్టం చేశారు. రైతు సమస్యలతో పాటు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, విద్యార్థుల ఇబ్బందులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా విద్యా రుసుముల రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.12 వేల కోట్లకు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. బకాయిలు పేరుకుపోవడంతో విద్యాసంస్థలు ధృవీకరణ పత్రాలను నిలిపివేస్తున్నాయని, దీనివల్ల ఉద్యోగాలు వచ్చిన యువత కూడా ధృవీకరణ పత్రాలు అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని వివరించారు.ఈ సమస్య పరిష్కారానికి పార్టీ సుదీర్ఘ కార్యాచరణను రూపొందించిందని వెల్లడించారు. ఇందులో భాగంగా ముందుగా పార్టీ నాయకుల బృందాలు జిల్లాల వారీగా పర్యటించి, విద్యార్థులను నేరుగా కలిసి వారి సమస్యలను, వినతిపత్రాలను సేకరిస్తాయన్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి నుంచి వచ్చిన పూర్తి సమాచారాన్ని సమీక్షించి, సభల వేదికలుగా ప్రజాప్రతినిధులంతా కలిసి ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పార్టీ నాయకత్వం కలిసికట్టుగా పోరాడుతుందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.





