- అంతర్జాతీయ కీబోర్డ్ ప్రదర్శనలో ప్రశస్థ అద్భుత రికార్డు
- హైదరాబాద్లో సర్టిఫికేట్ అందజేసిన హల్లెల్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణానికి చెందిన విద్యార్థిని ప్రశస్థ అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత సాధించింది. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కీబోర్డ్ ప్రదర్శనలో పాల్గొని, ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరును లిఖించుకుంది. తాండూరు బిఎస్ఎన్ఎల్ ఎస్డిఈ పి. ప్రమోద్ కుమార్ కూతురు అయిన ప్రశస్థ సాధించిన ఈ విజయం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక చారిత్రాత్మక కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుంచి తరలివచ్చిన 2,000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఏకధాటిగా, ఎలాంటి విరామం లేకుండా గంటపాటు కీబోర్డ్ వాయించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ బృహత్తర ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 777 మందిని గిన్నిస్ రికార్డు గ్రహీతలుగా ఎంపిక చేయగా, అందులో ప్రశస్థ స్థానం సంపాదించుకొని తాండూరు కీర్తిని చాటింది.హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ రికార్డు సాధించిన సందర్భంగా మే 29న హైదరాబాద్ గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో గిన్నిస్ ‘అచీవర్స్ మీట్’ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రశస్థకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారిక సర్టిఫికేట్ను అందజేసి ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ప్రశస్థను పలువురు డివిజన్ అధికారులు, పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.




