- యుద్ధప్రాతిపదికన నూతన బోర్ మోటార్ ఏర్పాటు
- మున్సిపల్ చైర్పర్సన్, అధికారులకు కౌన్సిలర్ జంటుపల్లి వెంకట్ కృతజ్ఞతలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని 19వ వార్డు పరిధిలో గల విశ్వంభర్ కాలనీ ప్రజల దశాబ్దాల నాటి తాగునీటి ఇబ్బందులకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీవాసుల ఎన్నో ఏళ్ల నాటి కల సాకారమవుతూ మంగళవారం వార్డులో నూతనంగా మంజూరైన బోర్ మోటార్ను బిగించి స్థానికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ జంటుపల్లి వెంకట్ మాట్లాడుతూ.. కాలనీని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న తీవ్ర నీటి సమస్యను గుర్తించి, సానుకూలంగా స్పందించి బోర్ మోటార్ ఏర్పాటుకు ప్రత్యేకంగా సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సమస్యను అర్ధం చేసుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించిన మున్సిపల్ డీఈ మణిపాల్, ఏఈ విష్ణు వర్ధన్లను ఆయన అభినందించారు.కొత్త బోర్ మోటార్ అందుబాటులోకి రావడంతో కాలనీలో తాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు సమద్, వాహిద్, నర్సిములు, పరమేశ్వర్, వార్డు మహిళలు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.




