- కౌన్సిలర్ అహంకారంతోనే దాడి: వార్డు ప్రజల ఆగ్రహం
- ఓర్వలేకే మా కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు: కాంగ్రెస్ నాయకుడు అఖిల్ బాబా
- చర్యలు తీసుకోవాలని తాండూరు పట్టణ పోలీసులకు వినతి
జనవాహిణి ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో రాజకీయ వివాదం ముదిరింది. కౌన్సిలర్ భర్త అనే అహంకారంతో తమపై దాడికి దిగడం ఎంతవరకు సమంజసమంటూ వార్డు ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5వ వార్డు మాజీ కౌన్సిలర్ సజీద్ తమ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారంటూ గత మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి అఖిల్ బాబా కుటుంబ సభ్యులు మంగళవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా అఖిల్ బాబా మాట్లాడుతూ.. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి సజీద్ భార్య చేతిలో ఓడిపోయినప్పటికీ, సజీద్కు ఆ గెలుపు సంతోషం లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా తాము నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నామని, ప్రజల్లో తమకు ఉన్న మంచి పేరు, ఆదరణను చూసి ఓర్వలేకే సజీద్ తమ ఇంటిపై దాడికి వచ్చారని ఆరోపించారు.తాము ఇంట్లో లేని సమయం చూసి, సజీద్ తమ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ, దాడికి దిగారని పేర్కొన్నారు. దమ్ముంటే నాపై నీ ప్రతాపం చూపించు.. అంతేగానీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపై దాడి చేయడం సిగ్గుచేటు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గెలిపించింది వార్డును అభివృద్ధి చేయడానికే గానీ, ఇలా దౌర్జన్యాలు చేయడానికి కాదని హితవు పలికారు. లేనిపోని కారణాలతో ఇళ్లపై దాడులు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న కౌన్సిలర్ భర్త సజీద్పై తాండూరు పట్టణ పోలీసులు తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిల్ బాబా డిమాండ్ చేశారు.




