- ఎన్నికలు ముగియగానే సామాన్యుడిపై భారం వేస్తారా?
- కేంద్ర మోదీ ప్రభుత్వంపై డీసీసీ అధికార ప్రతినిధి కే. గోపాల్ తీవ్ర ఆగ్రహం
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచడం సామాన్య ప్రజల నడ్డి విరచడమేనని డీసీసీ అధికార ప్రతినిధి, న్యాయవాది కే. గోపాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంధన ధరలను పెంచి మోదీ ప్రభుత్వం మరోసారి దేశ ప్రజలను నిలువునా వంచించిందని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచబోమని పదేపదే ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు, ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే ధరలు పెంచి తమ నైజాన్ని చాటుకున్నారని విమర్శించారు. ఇది ముమ్మాటికీ ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఒకవైపు ప్రధాని మోదీ తనను తాను ‘విశ్వగురువు’గా ప్రకటించుకుంటూ, భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని జబ్బలు చరుచుకుంటున్న బీజేపీ నాయకులు… ఇప్పుడు ఈ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రజల ముందు ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు.కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే బీజేపీ మతాన్ని వాడుకుంటోందని, హిందూ-ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడం మోదీ, బీజేపీల రాజకీయ సంస్కృతిలో భాగమైపోయిందని గోపాల్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన పంథాను మార్చుకోవాలని, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సామాన్యులపై అదనపు భారాన్ని మోపేలా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




