- రాజు గౌడ్ వ్యాఖ్యలు రాజకీయ స్టంట్ మాత్రమే
- అధికారం పోయాక రాజు గౌడ్కు రైతు ప్రేమ పుట్టుకొచ్చింది
- పదేళ్లు రైతులను ఇబ్బంది పెట్టి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు.”
- 15 వ వార్డ్ కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప
జనవాహిని ప్రతినిధి తాండూరు : బిఆర్ఎస్ నాయకుడు రాజు గౌడ్ కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తాండూరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. రైతు దీక్ష పేరుతో రాజు గౌడ్ చేస్తున్నది ధర్నా కాదు, అదొక డ్రామా అని విమర్శించారు.గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతులు విత్తనాల కోసం, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్నప్పుడు రాజు గౌడ్ ఎందుకు నోరు మెదపలేదని ఎల్లప్ప ప్రశ్నించారు. అప్పుడు లేని రైతు ప్రేమ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తుంటే ఓర్వలేక బయటకు రావడం సిగ్గుచేటని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామంటూ రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నది బిఆర్ఎస్ నాయకులేనని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఎల్లప్ప ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు.




