- అన్నదాతలకు సంకెళ్లు వేసిన నేతలకు దీక్షలు చేసే హక్కుందా?
- నాడు బేడీలు.. నేడు మొసలి కన్నీళ్లా?
- బీఆర్ఎస్ నేతల్లారా.. ఆ చరిత్ర మరువొద్దు!
- 19వ వార్డ్ కౌన్సిలర్ జంటుపల్లి వెంకట్
జనవాహిని ప్రతినిధి తాండూరు : అన్నదాతల కాళ్లకు బేడీలు వేయించిన అపఖ్యాతి మూటగట్టుకున్న బీఆర్ఎస్ నేతలు, నేడు రైతుల కోసం దీక్షలు చేయడం హాస్యాస్పదం అని 19వ వార్డు కౌన్సిలర్ జంటుపల్లి వెంకట్ మండిపడ్డారు. మంగళవారం లక్ష్మినారాయణ పూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైతు దీక్షపై ఆయన స్పందించారు.గత ప్రభుత్వ హయాంలో రైతులు తమ గోడు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే, వారిని తీవ్రంగా అవమానించిన సంఘటనలు రాష్ట్ర ప్రజల కళ్లముందే ఉన్నాయని వెంకట్ గుర్తు చేశారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదని, అప్పట్లో నోరు మెదపని నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.పదేళ్ల పాలనలో రైతుల కష్టాలను ఏనాడూ పట్టించుకోని వారు, నేడు అధికారం పోగానే రైతు పక్షపాతులుగా నటిస్తున్నారని విమర్శించారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే లక్ష్మినారాయణ పూర్ లో ఈ వింత దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.అబద్ధపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే సహించేది లేదని, రైతులు అన్ని గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. రైతుల పక్షపాతీ మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని అన్నారు. అయనపై తప్పుడు ప్రచారాలు చేయ్యడం మానుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని, అవాస్తవ ప్రచారాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.




