- వచ్చిరాని వైద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదు..
- ఆధారాలతో సహా సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా..
- పాత కూరగాయల మార్కెట్ కేంద్రంగా సాగుతున్న ‘అరాచక’ వైద్యం..
జనవాహిని ప్రతినిధి తాండూరు : వైద్యం తెలియదు.. డిగ్రీలు లేవు.. కానీ తెల్ల కోటు వేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాండూరు పట్టణంలో తిష్టవేసిన నకిలీ డాక్టర్ల ఆగడాలపై మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నకిలీ డాక్టర్లారా.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు” అంటూ ఆయన బహిరంగ హెచ్చరిక జారీ చేశారు.
పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఓ ఆర్.ఎం.పి డాక్టర్ సాగిస్తున్న నిర్వాకంపై మిత్రూ నాయక్ మండిపడ్డారు. కనీస పరిజ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా హైడోస్ మందులు, ఇంజెక్షన్లు ఇస్తూ ప్రజలను రోగాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. వీరి వద్దకు వచ్చిన సామాన్య ప్రజలు నయమవ్వడం పక్కన పెడితే, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లి మంచాన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని మిత్రూ నాయక్ వెల్లడించారు. “వచ్చీరాని వైద్యంతో అమాయక ప్రజల ప్రాణాలను వ్యాపార వస్తువులుగా మార్చే వారిని చట్టం ముందు నిలబెడతాం. సోమవారం అన్ని ఆధారాలను బయటపెట్టి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.
పట్టణం నడిబొడ్డున ఇంత దారుణం జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి నకిలీ క్లినిక్లపై దాడులు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ ప్రకటనతో తాండూరు పట్టణంలోని నకిలీ డాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సోమవారం మిత్రూ నాయక్ బయటపెట్టబోయే ఆధారాలు ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి.




