- పాఠశాల భూమిపై ‘షాపింగ్’ దందా…!
- నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు
- కమిషనర్కు బిఆర్ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు.. విచారణకు డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని విద్యాసంస్థల భూములే లక్ష్యంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారని బిఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. పట్టణం లోని ప్రభుత్వ విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల స్థలాన్ని ఆక్రమించి యథేచ్ఛగా సాగిస్తున్న అక్రమ నిర్మాణాలపై బుధవారం మున్సిపల్ కౌన్సిలర్లు పిర్యాదు చేశారు. బిఆర్ఎస్ పార్టీ 12 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 111లో గల ప్రభుత్వ పాఠశాల స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టినట్లు కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ పనులు కొనసాగిస్తున్నారని వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యా వ్యవస్థకు చెందిన భూమిని స్వప్రయోజనాల కోసం, వాణిజ్య అవసరాలకు వినియోగించడం అన్యాయమని వారు మండిపడ్డారు.ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, సదరు స్థలాన్ని తిరిగి పాఠశాల స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇర్షాద్, అనిల్, జావిద్, యోగానంద్ , నాయకులు ఎజాస్,అనంత్ రెడ్డి, రుద్రు పాటిల్, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్లు వెల్లడించారు.



