- తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు
- పెద్దేముల్ మండలం బాయిమీది తండాలో ఘోరం
- మద్యం మత్తులో భార్యాబిడ్డలను వేధిస్తున్నాడని దాడి
- నిందితుడి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : మద్యం మత్తులో భార్యాబిడ్డలను వేధిస్తున్నాడన్న కోపంతో, కన్న తండ్రినే కుమారుడు గొడ్డలితో నరికి చంపిన విషాద ఘటన పెద్దేముల్ మండలంలోని బాయిమీది తండాలో చోటుచేసుకుంది. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..బాయిమీది తండాకు చెందిన రాథోడ్ లోక్య నాయక్, బిక్కి బాయి దంపతులకు ముగ్గురు సంతానం. లోక్య నాయక్ మద్యానికి బానిసై తరచుగా భార్యను, ఇంట్లోనే ఉంటున్న చిన్న కుమార్తెను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం లోక్య నాయక్ తన భార్య, కుమార్తెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త వేధింపులు భరించలేక బిక్కి బాయి వెంటనే హైదరాబాద్లో ఆటో నడుపుకుంటున్న తన కుమారుడు రాథోడ్ సునీల్ నాయక్ (34)కు ఫోన్ చేసి సమాచారం అందించింది.హైదరాబాద్ నుండి స్వగ్రామానికి చేరుకున్న సునీల్ నాయక్.. తన తల్లి, చెల్లెలిని ఎందుకు కొడుతున్నావంటూ తండ్రిని నిలదీశాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో సునీల్ నాయక్ ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని తండ్రి మెడ, దవడ, తల వెనుక భాగంలో బలంగా నరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో లోక్య నాయక్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న వెంటనే పెద్దేముల్ ఎస్సై మరియు తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు సునీల్ నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి, నిందితుడిని శనివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.





