- భక్తులు, ప్రజల అవస్థలు
- గాంధీ చౌక్లో వెలగని వీధి దీపాలు.. అధ్వాన్నంగా రోడ్లు
- కౌన్సిలర్ సుప్రీత కరుణాకర్ అధికారులకు విజ్ఞప్తి
- జాతర లోపు మరమ్మతులు చేయాలని డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన గాంధీ చౌక్ వద్ద రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని 34వ వార్డు కౌన్సిలర్ సుప్రీత కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ గుండెకాయ వంటి గాంధీ చౌక్ ప్రాంతంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, బట్టల దుకాణాలు, కిరాణా వర్తక సముదాయాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే గాంధీ చౌక్ ప్రాంతంలో వీధి దీపాలు వెలగకపోవడం శోచనీయమన్నారు. పండుగల వేళ ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు చీకటిలో రోడ్డుపై ఉన్న గుంతలు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. వ్యాపార పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న చోట కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు.మరో కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న శ్రీ భద్రేశ్వర స్వామి జాతరను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు పట్టణానికి తరలివస్తారని, ఈ క్రమంలో ఈ అధ్వాన్నపు రోడ్లు భక్తులకు శాపంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతర సమయానికల్ల, రోడ్డుపై ఉన్న ప్రమాదకర గుంతలకు ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని, ప్రధాన కూడళ్లలో వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.



