- తాకితండాలో మృత్యుపాశంలా మారిన పురాతన వాటర్ ట్యాంక్!
- ప్రమాద నీడలో 5 ఇళ్లు.. 70 మంది ప్రాణాలు
- తక్షణమే కూల్చివేయాలని గ్రామస్తుల డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : బషీరాబాద్ మండల కేంద్రంలోని తాకితండాలో ఉన్న అతి పురాతన తాగునీటి ట్యాంక్ ప్రస్తుతం స్థానిక నివాసితులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారానే గతంలో బషీరాబాద్ గ్రామమంతటికీ నీటి సరఫరా జరిగేది. అయితే, కాలక్రమేణా ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.ప్రస్తుతం ఈ ట్యాంక్ పిల్లర్లు పగుళ్లు ఇచ్చి, సిమెంట్ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఏ క్షణాన ఈ భారీ నిర్మాణం కూలిపోతుందో తెలియని స్థితిలో ఉంది. ట్యాంక్ చుట్టుపక్కల నివసిస్తున్న సుమారు 70 మంది ప్రతి నిమిషం భయం భయంతో గడుపుతున్నారు. గాలి వచ్చినా, వర్షం కురిసినా ట్యాంక్ ఎక్కడ తమ ఇళ్లపై పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెను ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించక ముందే, ప్రభుత్వం మరియు సంబంధిత పంచాయతీ రాజ్ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ శిథిల ట్యాంకును కూల్చివేసి, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణ చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



