వెలుగులేని తాండూరు బస్టాండ్...!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • అంధకారంలో తాండూరు బస్టాండ్.. ప్రయాణికుల హాహాకారాలు!
  • ఉదయం నుంచే నిలిచిన విద్యుత్ సరఫరా
  •  చీకట్లోనే బస్సుల కోసం ఎదురుచూపులు
  •  దొంగల భయంతో వణుకుతున్న జనం.. పట్టించుకోని అధికారులు

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. శనివారం ఉదయం నుంచే బస్టాండ్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి సమయానికి బస్టాండ్ మొత్తం చిమ్మచీకటిగా మారిపోయింది. కనీసం బల్బులు కూడా వెలగకపోవడంతో ప్రయాణికులు అంధకారంలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ఉదయం నుంచే విద్యుత్ లేదని తెలిసినా ఆర్టీసీ అధికారులు కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతంలో జనరేటర్ లేదా ఇన్వర్టర్ సదుపాయం కూడా అందుబాటులో లేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.తాండూరు బస్టాండ్ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు, దొంగతనాలకు పెట్టింది పేరు. గతంలో ఇక్కడ పలువురి ప్రయాణికుల బ్యాగులు, సెల్ ఫోన్లు మాయమైన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు బస్టాండ్ మొత్తం అంధకారమయం కావడంతో దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉందని మహిళా ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలతో ప్రయాణించే వారు, వృద్ధులు చీకటిలో బస్సు ఎక్కేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.విద్యుత్ లేకపోవడంతో, సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులోనే ప్రయాణికులు తమ సామాన్లను భద్రపరుచుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చేయాలని, ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *