- అర్హులందరికీ సొంతింటి కల నెరవేరుస్తాం…!
- ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి
- కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మాతా శిశు ఆసుపత్రి పరిశీలన
జనవాహిని ప్రతినిధి తాండూరు : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆయన తాండూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణ శివారులో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, అలాగే మాతా శిశు ఆసుపత్రిని క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా చేశారని గుర్తుచేశారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమన్వయంతో పారదర్శకమైన జాబితాను సిద్ధం చేస్తాం. సొంత స్థలం లేని నిరుపేదలకు ఈ ఇళ్లను కేటాయించి వారికి అండగా ఉంటాం అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఎమ్మెల్యే మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలు, మౌలిక వసతుల కొరత గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డి.సి.హెచ్.ఎస్ ఆనంద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



