మనోహర్ రెడ్డి మార్క్ పాలిటిక్స్...!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పనితనం.. మున్సిపల్ ఫలితాలే నిదర్శనం!
  • తాండూరులో కాంగ్రెస్ అఖండ విజయం,టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి రెండేళ్ల అభివృద్ధి పాలనకు నిదర్శనమని, ఇది ఆయన పనితనానికి ప్రజలు ఇచ్చిన రిఫరెండం అని కాంగ్రెస్ పార్టీ తాండూరు టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా అన్నారు. శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హబీబ్ లాలా మాట్లాడుతూ, తాండూరు పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 36 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను కైవసం చేసుకుని, సొంతంగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే స్థాయికి చేరిందన్నారు. స్వల్ప ఓట్లతో కోల్పోయిన స్థానాల్లో కూడా ప్రజల మద్దతు తమకే ఉందని, ప్రజలిచ్చిన ఈ తీర్పుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు.ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాలను, నాటకీయ రాజకీయాలను ప్రజలు నమ్మలేదని హబీబ్ లాలా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ముందుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి ఆర్భాటంగా ప్రచారం చేసినప్పటికీ, సదరు అభ్యర్థి కూడా ఓటమి పాలుకావడం ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల జిమ్మిక్కులను పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సమిష్టిగా పనిచేశాయని కొనియాడారు.ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆలోచనలు, ప్రచార శైలి మరియు నాయకుల టీమ్ వర్క్ వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు. 21వ వార్డు కౌన్సిలర్‌గా తనను గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వచ్చే ఐదేళ్ల పాటు ప్రజా సేవలో ముందుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆశీస్సులతో నూతనంగా గెలిచిన కౌన్సిలర్లందరం కలిసి తాండూరు పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *