తాండూరు బల్దియా పై మనోహరన్న మార్క్..!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • తాండూరు మున్సిపాలిటీలో 'హస్తం' హవా
  •  మనోహర్ రెడ్డి నిశ్శబ్ద విప్లవం!
  • ఆర్భాటాల్లేవు.. అరుపుల్లేవు.. పక్కా వ్యూహంతో పీఠం కైవసం

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాజకీయాల్లో వ్యూహం పదునుగా ఉంటే విజయం వరిస్తుందని బుయ్యని మనోహర్ రెడ్డి మరోసారి నిరూపించారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఏ పార్టీ తోక పట్టుకోకుండా, ఎవరి మద్దతు అడగకుండానే 19 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసి ‘మేజిక్ ఫిగర్’ను సొంతం చేసుకుంది. 2019 నాటి గందరగోళానికి తెరదించుతూ 2026లో తాండూరు మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు, కేటీఆర్ రోడ్ షోలతో హోరెత్తించగా.. కాంగ్రెస్ మాత్రం సైలెంట్ వార్ కు ప్రాధాన్యతనిచ్చింది. మనోహర్ రెడ్డి కేవలం 4 స్ట్రిక్ట్ కార్నర్ మీటింగ్ లతోనే మొత్తం మున్సిపాలిటీని తన వైపు తిప్పుకున్నారు. అనవసర గొడవలకు పోకుండా, చివరి నిమిషం వరకు వ్యూహాలను గోప్యంగా ఉంచి ప్రత్యర్థులకు ఊపిరి ఆడనివ్వలేదు. తమ పార్టీ చైర్మన్ అభ్యర్థిని కూడా ప్రకటించకుండా 19 స్థానాలు కైవసం చేసుకోవడం తో మనోహర్ అన్న మార్క్ మాస్ అనే చెప్పవచ్చు. కేవలం పార్టీ విధేయులకే కాకుండా, క్షేత్రస్థాయిలో పట్టున్న 'గెలుపు గుర్రాల'ను గుర్తించి వారికి మాత్రమే బీ-ఫామ్ లు ఇవ్వడం ఈ విజయానికి ప్రధాన కారణం.గతంలో జరిగిన 'రెండున్నర ఏళ్ల' పదవీ కాల ఒప్పందాల వల్ల మున్సిపల్ అభివృద్ధి కుంటుపడిందని ప్రజల్లో ఉన్న అసహనాన్ని కాంగ్రెస్ సరిగ్గా వాడుకుంది.36 వార్డులున్న తాండూరులో 19 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఏకపక్ష నిర్ణయాధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది.గత కౌన్సిల్ కాలంలో జరిగిన అంతర్గత విభేదాలు, అభివృద్ధి ఆగిపోవడంతో తాండూరు ప్రజలు విసిగిపోయారు. ఈసారి మనోహర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ కట్టబెట్టడం ద్వారా స్థిరమైన పాలనను కోరుకుంటున్నట్లు ఓటర్లు స్పష్టం చేశారు. ఆర్భాటం కంటే పనితనం నమ్ముకున్న హస్తం పార్టీ, తాండూరు మున్సిపాలిటీలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *